News

ఆలయం కూల్చివేత ఘటనలో ఇద్దరు అరెస్ట్

269views

అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం కనుగొండ అటవీ ప్రాంతంలోని అభయాంజనేయస్వామి ఆలయం కూల్చివేత ఘటనలో నిందితులకు పేలుడు పదార్థాలు సరఫరా చేసిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ దర్బార్‌ కొండయ్యనాయుడు తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ములకలచెరువులోని కనుగొండ అటవీ ప్రాంతంలో ఈ నెల 14న అభయాంజనేయస్వామి ఆలయాన్ని కొందరు కూల్చేశారు. ఆలయ పూజారి విద్యాసాగర్‌ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. అదే ప్రాంతానికి చెందిన కనుగొండస్వామి ఆలయ పూజారి హరినాథ్‌యాదవ్‌ ఈ ఘటనకు పాల్పడినట్లు గుర్తించారు. కనుగొండస్వామి ఆలయానికి భక్తులు రాకపోవడంతో కక్ష పెంచుకున్నాడన్నారు. దీంతో పాటు ప్రభుత్వం ఆలయాల్లో దూపదీప నైవేద్యాలకు అందించే రూ.10వేలు తన ఆలయానికి రాకుండా పోతుందని భావించాడు. అభయాంజనేయస్వామి ఆలయం లేకుంటే తన ఆలయానికి భక్తులు ఎక్కువగా రావడంతో పాటు ప్రభుత్వం నుంచి డబ్బు వస్తుందని ఈ నెల 14న కొందరితో కలిసి ఆలయానికి జిలెటిన్‌ స్టిక్స్‌ పెట్టి పేల్చేందుకు ప్రయత్నించాడు. అవి పనిచేయకపోవడంతో గునపాలతో ఆలయాన్ని ధ్వంసం చేయించినట్లు తేలిందన్నారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడైన హరినాథ్‌యాదవ్‌, లక్ష్మీనారాయణ, రాఘవాచారి, మధు, షేక్‌ ఇలాహీబాషా, మహేశ్వర్‌రెడ్డిని అరెస్టు చేసి రెండు జిలెటిన్‌ స్టిక్స్‌ సీజ్‌ చేశామన్నారు. వీరికి జిలెటిన్‌ స్టిక్స్‌ సరఫరా చేసింది శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం టి.సదుం గ్రామానికి చెందిన వెంకటనారాయణ (27), షేక్‌ ఈదుల్లా (24)గా గుర్తించారు. వీరిద్దరినీ అరెస్టు చేసి విచారణ చేశారు. వీరు తనకల్లు సమీపంలో మూతపడిన క్వారీలో ఉన్న షెడ్డులో జిలెటిన్‌ స్టిక్స్‌ సేకరించినట్లు తేలడంతో అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఆధిపత్యం కోసమే గుడిని ధ్వంసం చేశారని, ఇందులో ఎలాంటి మతపరమైన అంశాలు లేవని డీఎస్పీ తెలిపారు. అభయాంజనేయస్వామి ఆలయాన్ని కూల్చివేసిన కేసులో నిందితులను 24 గంటల్లోనే అరెస్టు చేయడం అభినందనీయమని టీఎస్‌ఎన్‌వీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు కట్టా దొరస్వామినాయుడు పేర్కొన్నారు.ఆయన ఎస్పీ విద్యాసాగర్‌నాయుడును మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. జిల్లాలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.