
‘శరణని వచ్చిన శత్రువునైన
పరికింపగా రాచపాడి రక్షింప
నీ విభీషణు డేల యేచినయట్టి
రావణుండైన గర్వము దక్కివచ్చి
శరణన్న గాతు నే చందమునైన
మరియాద లిట్టివి మాకులంబునకు’
ఆ సమయంలో విభీషణుడు వచ్చాడు. తన అన్న రావణుడు వెళ్లగొట్టాడు. అందుకని తన నలుగురు మంత్రులతో కలిసి వచ్చి, “రామా, శరణు శరణు” అన్నాడు. శ్రీరాముడు అందరినీ సమావేశపరిచాడు. ‘ఏం చేద్దాం’ అన్నాడు. “గుప్తచారులను పెట్టి పరీక్షిద్దాం” అన్నాడు శరభుడు అనే వానరుడు. “నాకు అనుమానం వేస్తున్నది” అని జాంబవంతుడన్నాడు. ‘ఇతడు తన అన్ననే మోసం చేసి వచ్చాడు. మనతో ఉంటాడని నమ్మకం ఏమిటి’ అన్నాడు సుగ్రీవుడు. సుగ్రీవుని మాటలకు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు రాముడు. రాముడి మనస్సులో భరతుడు మెదిలాడు. చేతికి వచ్చిన రాజ్యంవద్దన్నాడు భరతుడు. అన్న వెంట బడ్డాడు. ఇక “ సుగ్రీవుడేం చేశాడు? అన్నను చంపాడు. గద్దె ఎక్కాడు. అందులో అధర్మం ఏమీ లేదు. కాని అట్టి సుగ్రీవుడు విభీషణుణ్ణి విమర్శిస్తున్నాడు. ఇదీ రాముడి నవ్వు. “విభీషణుడు సాధు పురుషుడు, స్వార్థ రహితుడు, ధర్మజ్ఞుడు, స్వీకరిద్దాం” అన్నాడు హనుమంతుడు. అంతా విని రాముడు తన నిర్ణయం చెప్పాడు.
“విభీషణుడే కాదు, రావణుడే స్వయంగా వచ్చి శరణు వేడినా నేను క్షమిస్తాను, అభయమిస్తాను” అన్నాడు. శక్తిమంతుడు రాముడు అనగలడు, చేయగలడు. “సాధు, సాధు” అన్నారందరూ. విభీషణుడు వచ్చి రామ పాదాలపై వాలాడు. విభీషణుని అప్పటికప్పుడే రాజ్యాభిషిక్తుణ్ణి చేశాడు రాముడు. “ఇక నుండి లంకకు నీవే రాజువు” అన్నాడు. విభీషణుడు చేసిన పని మంచిదేనా? అన్నను వదలిపెట్టటం, శత్రుపక్షంలో చేరటం భ్రాతృ ద్రోహం కాదా? అని అడగవచ్చు. కాని విభీషణుడు వదిలి పెట్టాడా? రావణుడు వెళ్లగొట్టాడా? మెడపట్టి నెడితే చూరుపట్టుకొని వేలాడుతుండాలా? విభీషణుడిని అసలు ఎందుకు బహిష్కరించాడు రావణుడు. “అగ్రజా, సీతను అప్పగించు రాముడికి” అని విభీషణుడు అన్నకు సలహా ఇచ్చాడు. అది తప్పు అయింది. అలాంటి సలహా ఇవ్వకుండా ఉంటే అక్కడే ఉండవచ్చు గదా అంటారు. కాని ధర్మం అని తెలిసిన దానిని చెప్పటానికి కూడా వీలులేని చోటు అయితే ఎలా? ధర్మం చెప్పటానికి సందేహించే తత్త్వం కాదు విభీషణుడిది. అలా సందేహించే వాడు ఒక మనిషా? భ్రాతృ ద్రోహం రావణుడిది, విభీషణుడిది కాదు.
ఇంకో విమర్శ ఉంది. రావణుడు మంచివాడు కాదని అనుకుందాం. వదలిపెట్టి వెళ్లవచ్చు. ఆ వెళ్లినవాడు శత్రుపక్షంలో చేరటమెందుకు? ఎక్కడికో పోయి ఉండవచ్చుగా! రాముడికి సాయం ఎందుకు? ఇంద్రజిత్తు వేసిన ప్రశ్న ఇది. “నేను అటు చేరను, ఇటు చేరను, తటస్థంగా ఉంటాను” అని చెప్పే తృతీయ ప్రకృతి కాదు విభీషణుడిది. ఇటువంటి తటస్థ విధానం అసమర్థులకు కావాలి. ఇందులో పౌరుషం లేదు పరాక్రమం లేదు. పురుషార్థంలేదు, ధర్మదృష్టి లేదు. ఎటో ఒక అటు చేరాలి ఇది తప్పనిసరి. ఒకానొక విచిత్ర పరిస్థితిలో బలరాముడు తటస్థంగా ఉండవలసింది. కాని కృష్ణుడిది ఆదర్శమార్గం. విభీషణుడు అదే పని చేశాడు. సజ్జనుల పక్షంలో చేరాడు.