
రత నౌకాదళానికి చెందిన శిక్షణ యుద్ధ నౌక ‘ఐఎన్ఎస్ సుదర్శిని’ (INS Sudarshini) సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ సంబంధాల బలోపేతమే లక్ష్యంగా సాగుతున్న ‘లోకాయన్ 26’ యాత్రలో భాగంగా.. ఈ నౌక విజయవంతంగా అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి, మే 27న కరేబియన్ దేశమైన యాంటిగ్వా చేరుకుంది. ఐఎన్ఎస్ సుదర్శిని చరిత్రలో ఈ స్థాయి సుదీర్ఘ సముద్ర ప్రయాణం (అట్లాంటిక్ క్రాసింగ్) ఇదే మొదటిసారి కావడం విశేషం. గతంలో 2007లో ‘ఐఎన్ఎస్ తరంగిణి’ మాత్రమే ఇలాంటి రికార్డును నమోదు చేసింది.
10 వేల మైళ్ల మైలురాయి..
ఈ ఏడాది జనవరి 20న కొచ్చిలో ప్రారంభమైన ఈ ప్రయాణంలో సుదర్శిని నౌక ఇప్పటివరకు 10,000 నాటికల్ మైళ్ల మైలురాయిని అధిగమించింది. కేప్ వెర్డే (ఆఫ్రికా) నుంచి యాంటిగ్వా వరకు ఉన్న అత్యంత సుదీర్ఘమైన దూరాన్ని ఈ నౌక 19 రోజుల పాటు ఎలాంటి విరామం లేకుండా కేవలం ‘తెరచాపల’ (Sails) సాయంతోనే దాటింది.
సాహసోపేత ప్రయాణం..
అట్లాంటిక్ సముద్రంలో ఎదురైన బలమైన ఈదురుగాలులు, భారీ అలలను తట్టుకుంటూ.. సాంప్రదాయ నావిగేషన్ పద్ధతుల ద్వారా సిబ్బంది సురక్షితంగా యాంటిగ్వా తీరానికి చేరారు. యాంటిగ్వా చేరుకున్న భారత నౌకకు అక్కడి భారత గౌరవ కాన్సుల్ జనరల్ విజయ్ తేవానీ, యాంటిగ్వా డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ బ్రిగేడియర్ టెల్బర్ట్ బెంజమిన్ ఘనస్వాగతం పలికారు. ‘వసుధైవ కుటుంబం’ అనే నినాదంతో పశ్చిమాసియా, యూరప్, ఆఫ్రికా దేశాల పర్యటన ముగించుకున్న సుదర్శిని.. ప్రస్తుతం కరేబియన్, అమెరికా దేశాల యాత్రలో ఉంది. యాంటిగ్వాలో సాంస్కృతిక కార్యక్రమాలు ముగించుకుని, త్వరలోనే అమెరికాలో జరగబోయే ‘సెయిల్ 250’ (SAIL 250) ఉత్సవాల్లో పాల్గొనడానికి నౌక బయలుదేరనుంది.





