
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖర పట్టణంలో భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఏర్పాటుకానున్న చోట 1,500 ఎకరాల్లో ‘స్పేస్ పార్క్’ నిర్మాణం కానుంది. ఇందుకోసం ఇస్రోతో తమిళనాడు ప్రభుత్వ నిర్వహణలోని ‘టిడ్కో’ ఒప్పందం కుదుర్చుకుంది. అంతరిక్ష శాఖలో అగ్రదేశాలైన అమెరికా, రష్యా, చైనా తదితర దేశాలకు ధీటుగా భారత్ కూడా వేగంగా అభివృద్ధి పథంలోకి దూసుకెళ్తోంది. ఒకప్పుడు అమెరికా, చైనా, ఐరోపా దేశాలు అంతరిక్ష ప్రయోగంలో ముందుండేవి. ప్రస్తుతం చైనా శాస్త్రవేత్తలు కూడా ఈ ప్రయోగాలు చేపట్టారు. భారత్లో 1983వ సంవత్సరం నుంచి అంతరిక్షంలోకి రాకెట్ల ప్రయోగం ప్రారంభమైంది. ప్రస్తుతం భారత్లో నెల్లూరు జిల్లా శ్రీహరికోట వద్ద బంగాళాఖాతం తీరంలో మాత్రమే రాకెట్ ప్రయోగ కేంద్రం అందుబాటులో ఉంది.
ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో సముద్రతీర ప్రాంతం ఉన్న తూత్తుకుడి జిల్లా కులశేఖర పట్టణంలో అంతరిక్ష ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటుచేసే చర్యలు చేపట్టింది. 2,233 ఎకరాల్లో రూ.950 కోట్లతో నిర్మించనున్న ఈ కేంద్రం శంకుస్థాపన ఫిబ్రవరి 28న ప్రధాని నరేంద్ర మోదీ చేశారు. ఇదిలా ఉండగా, ఈ కేంద్ర ప్రాంగణంలోనే స్పేస్ పార్క్ ఏర్పాటుచేసేందుకు రాష్ట్రప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ మెగా ప్రాజెక్ట్ కోసం ఇస్రో ్థతో టిడ్కో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ స్పేస్ పార్క్ అందుబాటులోకి వస్తే రాకెట్లకు అవసరమైన విడిభాగాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు తయారుచేయవచ్చని, స్పేస్ పార్క్కు అవసరమైన స్థలాన్ని సేకరించే పనులు వేగవంతం చేసినట్లు టిడ్కో అధికారులు తెలిపారు.





