News

చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహ వాహనంపై ఆదిదంపతులు

233views

చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదిదంపతులకు సింహ వాహన సేవను దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో రుత్వికులు శోభాయమానంగా మంగళవారం నిర్వహించారు. మల్లికార్జున మహామండపం వద్ద అలంకరించిన సింహ వాహనంపై గంగా, పార్వతి సమేత దుర్గామల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తులను ఉంచి రుత్వికులు పూజ చేసి ఊరేగింపును ప్రారంభించారు. కనకదుర్గానగర్‌, రథం సెంటరు, కెనాల్‌ రోడ్డు పైవంతెన, ఏలూరు రోడ్డు, లెనిన్‌సెంటరు, బందరులాకులు, పోలీసుకంట్రోల్‌ రూమ్‌, వినాయకుడి గుడి, రథం సెంటరు మీదుగా మల్లికార్జున మహామండపం వద్దకు ఊరేగింపు చేరింది. దారిపొడవునా నగర వాసులు అమ్మవారికి హారతులు ఇచ్చి స్వాగతం పలికారు.

శాస్త్రోక్తంగా సదస్యం, వేదస్వస్తి..
చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా గంగా, పార్వతీ సమేత దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దివ్యలీలా కల్యాణం పూర్తయిన తరువాత వివాహ తంతులో భాగంగా వేదపండితుల సమక్షంలో సదస్యం, వేదస్వస్తి కార్యక్రమాలను మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం వేదపండితులను దేవస్థానం ఈవో రామారావు, స్థానాచార్య శివప్రసాద శర్మ, వైదిక కమిటీ సభ్యులు శ్రీనివాసశాస్త్రి, యజ్ఞనారాయణ శర్మ, కోట ప్రసాద్‌ నూతన వస్త్రాలతో సత్కరించారు. దేవస్థానం వేదపాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.