News

CAA: అమెరికా వారికి పౌరసత్వం ఇస్తుందా..?: హరీశ్‌ సాల్వే

501views

భారత్‌ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) (CAA) అమలు చేయడంపై ఇటీవల అమెరికా ఆందోళన వ్యక్తం చేయడాన్ని సీనియర్‌ న్యాయవాది, మాజీ సోలిసిటర్‌ జనరల్‌ హరీశ్‌ సాల్వే తప్పుపట్టారు. ప్రపంచ వ్యాప్తంగా వేధింపులకు గురవుతున్న మైనార్టీల కోసం అమెరికా సరిహద్దులు తెరుస్తుందని వ్యంగ్యంగా అన్నారు. ఓ ఆంగ్లవార్తా సంస్థతో ఆయన మాట్లాడారు. ‘‘పాకిస్థాన్‌లో వేధింపులకు గురయ్యే అహ్మదీయాలు, మయన్మార్‌లోని రోహింగ్యాలు, దారుణంగా ప్రాణాలు కోల్పోతున్న పేద పాలస్తీనావాసులకు అమెరికా పౌరసత్వం ఇస్తుందా..? ఒక వేళ ఇవ్వకపోతే నోరుమూసుకోవాలి’’ అని అన్నారు.

ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చే అంశాన్ని అగ్రరాజ్యం పునఃపరిశీలించుకోవాలని, అంతర్గత సమస్యలపై దృష్టిపెట్టాలని సాల్వే అమెరికాకు హితవు పలికారు. పాక్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌లో మైనార్టీల సంఖ్య వేగంగా పడిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో భారత్‌కు శరణార్థులను తట్టుకొనే శక్తి పరిమితంగానే ఉందన్నారు. శ్రీలంక, మయన్మార్‌ మత రాజ్యాలు కాదని.. అందుకనే వాటిని సీఏఏలో చేర్చలేదని అభిప్రాయపడ్డారు.

సీఏఏ అమలు కోసం భారత్‌ జారీ చేసిన నోటిఫికేషన్‌పై ఇటీవల అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశం తమను ఆందోళనకు గురిచేస్తోందని, దీని అమలును నిశితంగా పరిశీలిస్తున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ తెలిపారు. ఈ వ్యాఖ్యలకు భారత్‌ దీటుగా స్పందించింది. భారత బహుళ సంస్కృతులు, దేశ విభజన అనంతర చరిత్రపై పరిమిత జ్ఞానం ఉన్నవారు అనవసర ఉపన్యాసాలు ఇవ్వొద్దని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ పేర్కొన్నారు.