
ఒడిశా పవిత్ర పుణ్యక్షేత్రం పూరి జగన్నాథుడి ఆభరణాల భాండాగారం రత్నభాండార్ ప్రత్యేక లెక్కింపు పూర్తయినట్లు అధికారులు ప్రకటించారు. అంతర్జాతీయ ప్రఖ్యాత పూరి జగన్నాథ యాత్ర ముగిసి జగన్నాథ, బలభద్రులు ఇద్దరు గుండిచ దేవస్థానంలోకి ప్రవేశించిన తరువాత ఈ ప్రత్యేక పరిశీలన నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.ఒడిశా ప్రభుత్వం నిర్దేశించిన రీతిలో ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
“దేవాలయంలోని వేర్వేరు పండుగల నేపథ్యంలో రత్నభాండార్ ప్రత్యేక పరిశీలన కార్యక్రమాన్ని మే నెల 23వ తేదీన నిలిపివేసిన విషయం తెలిసిందే. గత నెలలో స్నాన పూర్ణిమ సందర్భంగా ఉత్సవమూర్తుల నుంచి తొలగించిన ఆభరణాల లెక్కింపు, బరువు తూచడం వంటివి చేశారు. ‘రాహు రేఖ’, బంగారు ‘చితా’, వెండి ‘రసిక’ఆభరణాలతోపాటు విగ్రహాలకు సంబంధించిన ఇతర ఆభరణాలను కూడా లెక్కించామని, శ్రీ జగన్నాథ్ దేవాలయ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన అడ్మినిస్ట్రేటర్ అరబింద పాధే తెలిపారు.
‘‘డిజిటల్ డాక్యుమెంటేషన్లో భాగంగా లెక్కింపు, బరువు తూచే ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీశాం’’అని ఆయన తెలిపారు. ఆభరణాల్లోని రత్నాలు, ఇతర విలువైన రాళ్లను నిపుణులు పరిశీలించారని, తెలిపారు. ప్రభుత్వం ఆమోదించిన ప్రామాణిక ప్రక్రియకు అనుగుణంగా లెక్కింపు ప్రక్రియ పూర్తిచేసినట్లు రత్నభాండార్ పరిశీలన కమిటీ అధ్యక్షులు జస్టిస్ (రిటైర్డ్) బిశ్వనాథ్ రథ్ తెలిపారు. దేవాలయానికి సంబంధించి రెండు రత్నభాండార్లు ఉంటే అందులోని బయటి భండాగారం లెక్కింపు ప్రక్రియ ప్రస్తుతం పూర్తవగా లోపలి దాని లెక్కింపు కొనసాగుతున్నట్లు మరో ఆధికారి తెలిపారు.





