
పౌరసత్వ సవరణ చట్టం CAA అమల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఇందులో ముస్లింలను చేర్చలేదు కాబట్టి, ఇది వివక్షతో కూడుకున్నదని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, క్రిస్టియన్లు, బౌద్ధులు, పార్సీలకు పౌరసత్వం మంజూరు చేసేలా తీసుకొచ్చిన ఈ చట్టంలో.. ముస్లింలను ఎందుకు చేర్చలేదంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకు తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బదులిచ్చారు. ఈ చట్టంలో ఎందుకు ముస్లింలను చేర్చలేదో కారణం తెలిపారు.
ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడుతూ.. ‘‘పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ దేశాలు ఇస్లామిక్ రాజ్యాలు. అలాంటప్పుడు అక్కడ ముస్లింలు మతపరమైన మైనారిటీగా ఎలా ఉంటారు? ఒకవేళ వాళ్లు భారత పౌరసత్వం పొందాలని కోరుకుంటే.. రాజ్యాంగబద్ధమైన మార్గాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు’’ అని చెప్పుకొచ్చారు.
ఈ చట్టంపై ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం సృష్టిస్తున్నాయని.. ప్రజల్లో భయం నెలకొల్పుతున్నాయని అమిత్ షా మండిపడ్డారు. పౌరసత్వం అనేది కేంద్రానికి సంబంధించిన అంశమని.. దీనిని ఏ రాష్ట్ర ప్ఱభుత్వమూ రద్దు చేయదని క్లారిటీ ఇచ్చారు. హిందువులు, ముస్లింల మధ్య గొడవలు సృష్టించాలని వాళ్లు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇక ఈ చట్టం గిరిజన ప్రాంతాలకు చెందిన వారి హక్కులను ఏమాత్రం నిర్వీర్యం చేయదని స్పష్టం చేశారు. ఇన్నర్ లైన్ పర్మిట్ సిస్టమ్ ఆరో షెడ్యూల్ ఏరియాల్లో చేర్చబడ్డ ప్రాంతాలు.. ఈ చట్టం పరిధిలోకి రాకుండా ఉండేలా ఈ చట్టంలోని నిబంధనలను రూపొందించామని అమిత్ షా తెలిపారు.





