
తిరుపతి శ్రీనివాసమంగాపురంలో వేంచేసిన శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. నేటి ఉదయం స్వామివారు శ్రీరాముల అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.
మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు శ్రీవారి కళ్యాణమండపంలో వసంతోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్వర్ణ రథోత్సవం జరుపుతారు. రాత్రికి గజవాహన సేవ నిర్వహిస్తారు. స్వామివారికి సోమవారం రాత్రి గరుడ వాహనసేవ వైభవంగా నిర్వహించారు. గరుడ వాహనంపై కొలువైన శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం.
తిరుపతి కపిలతీర్థంలోని శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామి వారు సోమస్కందమూర్తిగా దర్శనమిచ్చారు. కామాక్షి అమ్మవారి సమేతంగా శేష వాహనం పై నుంచి భక్తులను కటాక్షించారు.
వేంకటాచలంపై శిలలన్నీ ఆదిశేషుని పడగలేనని పురాణాల్లో పేర్కొన్నారు. శ్రీకూర్మం మీద ఆదిశేషుడు అవతరించాడు. ఆదిశేషుడి పై భూమండలం కొలువుదీరింది. ఆ భూమిని ఛేదించుకుని ఉద్భవించిన పాతాళ మహాలింగాన్ని కపిలమహర్షి పూజించారు. ఆ లింగం వెలిసిన ఈ ప్రదేశమే కపిలతీర్థం.





