
హిందూ ధర్మం గొప్పతనాన్ని తెలియజేసే విధంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా వార, మాసోత్సవాలను నిర్వహిస్తున్నామని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు.వెలగపూడి సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా రూ.1600 కోట్ల వ్యయంతో ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. శ్రీశైలం దేవాలయంలో భక్తులకు సౌకర్యం కల్పించే దిశగా సాలమండపాలు నిర్మాణాలను త్వరలో ప్రారంభించనున్నామని తెలిపారు. విజయవాడలో ఇటీవల జరిగిన మహాలక్ష్మి యజ్ఞం ఫలితంగా కేంద్రం నుంచి నిధులు వరదల్లా పారాయన్నారు. 2018 వరకు 1621 దేవాలయాలకు మాత్రమే ధూపదీప నైవేధ్యాల సౌకర్యం ఉండేదని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 10వేల దేవాలయాల వరకు ధూపదీప నైవేధ్యాలు జరిగేలా నిర్ణయం తీసుకున్నామన్నారు.
అర్చక వెల్ఫేర్ బోర్డు, ఆగమ సలహామండలి, అర్చక ట్రైనింగ్ అకాడమీని ఏర్పాటు చేశామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఆన్లైన్ ద్వారా బుకింగ్ సౌకర్యం కల్పించే విధంగా సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ఆన్లైన్ బుకింగ్ కోసం యాప్ను కూడా రూపొందించామన్నారు.
దేవాలయాల భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడుకునేందుకు కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఎండోమెంట్ ఆస్తుల లీజు గడువు ముగిశాక ఖాళీ చేసే విధంగా ఒక చట్టాన్ని అమల్లోకి తెచ్చామన్నారు. ఆ చట్టం ప్రకారం వారిని ఖాళీ చేసేలా చర్యలు తీసుకుంటుందన్నారు. అర్చకులు పనిచేసే దేవాలయాల పరిధిలో వారికి ఇళ్ళ స్థలాలు కేటాయించామన్నారు. అందులో భాగంగా ఇళ్ళు లేని పేద అర్చకులకు ఇళ్ళు మంజూరు చేశామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల ఉద్యోగులకు పదోన్నతులు కల్పించామని చెప్పారు.
ఐదేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం దేవదాయ శాఖ ఆధ్వర్యంలో 4,500 కొత్త ఆలయాల్ని నిర్మించిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం తక్కువగా ఉండే చిన్న గుళ్లలో సైతం నిత్యం ధూపదీప నైవేద్య కార్యక్రమాలు కొనసాగేలా.. డీడీఎన్ఎస్ పథకం పేరుతో అర్చకులకు తగిన ఆర్ధిక సహాయం అందిస్తున్నామన్నారు.




