
ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం, కాశీ విశ్వనాథుడు కొలువైన వారణాసిలో కొత్త క్రికెట్ స్టేడియం నిర్మించనున్నారు. నేడు ప్రధాని నరేంద్ర మోదీ ఈ స్టేడియానికి శంకుస్థాపన చేశారు. నూతనంగా నిర్మించనున్న ఈ స్టేడియాన్ని శివతత్వం ఉట్టిపడేలా డిజైన్ చేశారు. త్రిశూలాన్ని పోలిన ఫ్లడ్ లైట్స్, శివుడి చేతిలో ఉండే ఢమరుకం రూపంలో పెవిలియన్ స్టాండ్ నిర్మించనున్నారు. గంగా ఘాట్ మెట్ల మాదిరిగా ప్రేక్షకుల గ్యాలరీ ఉండనుంది. స్టేడియం ప్రవేశ ద్వారంలో బిల్వ పత్రం ఆకును పోలిన మెటాలిక్ షీట్లను ఏర్పాటు చేయనున్నారు. పైకప్పు అర్ధ చంద్రాకారాన్ని ప్రతిబింబించనుంది. సూమారు 30,000 సీటింగ్ సామర్థ్యంతో స్టేడియాన్ని నిర్మించనున్నారు. ఈ స్టేడియం నిర్మాణానికి అవసరమైన 121 ఎకరాల భూసేకరణ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.121 కోట్లు వెచ్చించింది. స్టేడియం నిర్మాణానికి రూ.330 కోట్లు ఖర్చుకానుంది. వారణాసిలోని రాజతలాబ్ ప్రాంతంలోని రింగ్ రోడ్కు సమీపంలో నిర్మించనున్న ఈ స్టేడియం 2025, డిసెంబర్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశముంది.