
నీటి సంరక్షణలో ప్రభుత్వ ప్రయత్నాలు మాత్రమే ఫలితాలు ఇవ్వవని… ఈ విషయంలో ప్రజల పాత్ర చాలా ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం వల్ల వారికి కూడా నీటి అవసరాలపై అవగాహన వస్తుందని చెప్పారు. పలు రాష్ట్రాలకు చెందిన నీటి వనరులు, పారుదల శాఖ మంత్రులతో నిర్వహించిన తొలి జాతీయ సదస్సులో ప్రధాని వర్చువల్గా మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యంతో కలిగే అతి ప్రధానమైన ప్రయోజనం చైతన్యం అని పేర్కొంటూ…. ఈ ప్రచార ఉద్యమంలో భాగంగా సాగుతున్న ప్రయత్నాల గురించి, అందుకోసం వెచ్చిస్తున్న డబ్బును గురించి ప్రజలలో ఒక అవగాహనను ఏర్పరచడమే ప్రజల భాగస్వామ్యంతో సిద్దించే అతిపెద్ద ప్రయోజనం అని కూడా ప్రధాని చెప్పారు.
ప్రతి ప్రచార ఉద్యమంలో ప్రజల్ని భాగస్వాములను చేయాలని సూచించారు. దీంతో ప్రజల్లో ఏదైనా పథకం, లేదా ప్రచార ఉద్యమం పట్ల యాజమాన్య భావన కూడా ఏర్పడుతుందన్నారు. నీరు.. రాష్ట్రాల మధ్య సహకారం, సమన్వయం, భాగస్వామ్యానికి సంబంధించిన అంశంగా ఉండాలని, అర్బనైజేషన్ వేగంగా జరుగుతున్న దృష్ట్యా ముందస్తుగా ప్రణాళికలు రూపొందించుకోవాలని కోరారు. రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం.. నీటి అంశం రాష్ట్రాల నియంత్రణలో ఉంటుందని, దేశ సమష్టి లక్ష్యాలను సాధించడంలో రాష్ట్రాల కృషి చాలా దోహదపడుతుందని చెప్పారు. వాటర్ విజన్ @2047 అనేది వచ్చే 25 ఏళ్ల అమృత్ కాల్ జర్నీకి చాలా ముఖ్యమని ప్రధాని చెప్పారు. ఉపాధి హామీ కింద చేసే పనుల్లో.. వీలైనంత ఎక్కువగా నీటి కోసం చేపట్టాలని సూచించారు. నీటి సంరక్షణపై అవగాహన పెంచాలని కోరారు. పరిశ్రమలు, వ్యవసాయం తదితర రంగాల్లో నీటి వినియోగం ఎక్కువగా ఉంటుందని… దీనిపై వారికి అవగాహన పెంచాలన్నారు. పంట మార్పిడి, ప్రకృతి వ్యవసాయం వంటివి చేపట్టాలని మోదీ పిలుపునిచ్చారు.
మురుగు నీటిని శుద్ది చేయాలి..
మురుగు నీటిని శుభ్రపరించేందుకు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మించామని, మరుగుదొడ్లు అందుబాటులోకి తెచ్చామని ప్రధాని చెప్పారు. అయితే మురుగు అనేది ఉండకూడదని ప్రజలు అనుకుంటేనే విజయం సాధిస్తామని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కలిసి ఓ వ్యవస్థలా పనిచేయాలని కోరారు. నీటిపై అవగాహన కల్పించేందుకు ‘వాటర్ అవేర్నెస్ ఫెస్టివల్స్’ లేదా ఇతర కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చని చెప్పారు. నీటి వ్యవస్థలను పునరుద్ధరించేందుకు ప్రతి జిల్లాలో 75 ‘అమృత్ సరోవర్ల’ చొప్పున నిర్మిస్తున్నామని, ఇప్పటిదాకా 25 వేల దాకా కట్టామని ప్రధాని వెల్లడించారు. ‘‘వాడుకున్న నీటిని మళ్లీ వాడుకుంటే, తాజా నీటిని సంరక్షించుకుంటే మొత్తం ఎకో సిస్టమ్కు ప్రయోజనం కలుగుతుందన్నారు. అందుకే వాటర్ ట్రీట్మెంట్, వాటర్ రీసైక్లింగ్ అనేది చాలా ముఖ్యం” అని ప్రధాని వివరించారు.