
నంద్యాల: ఇక్కడి ధర్మ జాగరణ, సామాజిక సమరసతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడేళ్ళుగా దళితులకు భవానీ దీక్షలకు ప్రోత్సహిస్తూ, వారికి దీక్షా వస్త్రాలు సమకూరుస్తున్న విషయం పాఠకులకు విదితమే. తాజాగా సంజీవ నగర్లోని భద్రావతి భావన రుషి దేవాలయంలో చింతలపల్లి వాసు ఆధ్వర్యంలో ఆదివారం భవాని పూజా కార్యక్రమం, భవాని భక్తులకు, దీక్షా దుస్తులు అందజేసిన దాతలకు బిక్ష కార్యక్రమం నిర్వహించారు. రామకృష్ణ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ రామకృష్ణారెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవాని దీక్షలో భక్తులు ధ్యానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని, ఇది మన సంస్కృతి పరిరక్షణకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. భవానీ దీక్షలతో ఏకాగ్రత సాధ్యపడుతుందన్నారు.

భవానీ దీక్షలు హైందవ సంస్కృతి పరిరక్షణకు దోహదపడతాయని డాక్టర్ ఉదయ్ శంకర్ పేర్కొన్నారు. న్యాయవాది తులసి రెడ్డి మాట్లాడుతూ భవాని పూజల వల్ల సమాజంలో సోదర భావం, మంచి అలవాట్లు పెంపొందుతాయన్నారు. దీక్షా సందర్భంగా వారు పొందిన అనుభూతులను, అలవరుచుకున్న ఉత్తమ అలవాట్లను దీక్ష తరువాత కూడా కొనసాగిస్తూ సార్థక, సమర్థ జీవనం గడపాలని సూచించారు. భవానీ భక్తులు, దాతలు 100 మందికి పైగా పాల్గొన్నారు. పూజా నిర్వహణ, బిక్ష ఏర్పాట్లకు ప్రదీప్, కటకం మధు, నరేంద్ర, రవి, దండు వెంకటేశ్వర్లు, కాటుకు నాగదీపు, తదితరులు సహకరించారు.





