
నంద్యాల: స్థానిక సంఘమిత్ర సేవా సమితి ఆవాసంలో స్వయం పరిపాలనా దినోత్సవం చిరంజీవి సురేంద్ర అధ్యక్షతన స్ఫూర్తి దాయకంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బాలలు 24 గంటలపాటు తమను తామే పరిపాలించుకుని, పరిపాలనకు నిర్దిష్ట నియమ నిబంధనలు ఎంత అవసరమో తెలుసుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు వల్ల విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు అలవడతాయని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సాయంత్రం ఏడు గంటలకు జరిగిన స్వ పరిపాలన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విద్యార్థులు బాల నరసింహ, కార్యదర్శిగా లక్ష్మణ్, ప్రధాన వక్తగా గోవింద రాజు, ఆవాస ప్రముక్గా శ్రీరామ్ స్వయం పరిపాలన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో విద్యార్థులు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత, శీలం వంటి విషయాల గురించి చక్కగా వివరించారు. సంఘమిత్ర కార్యవర్గ సభ్యులు, వివిధ క్షేత్రాల కార్యకర్తలు పెద్దలు, మాతృ మూర్తులు, కార్యకర్తలు పాల్గొన్నారు.








