
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్యపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. తెలిసినవారు, సన్నిహిత భాగస్వాముల వల్ల మహిళలపై జరిగే హింసను తప్పకుండా చర్చించాల్సి ఉందని ఆమె అన్నారు. ఓ చర్చావేదికలో భాగంగా అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. ‘ఎంతగా ఆవేశం వచ్చినా ఎవరూ ఒక మహిళను ముక్కలుగా చేయరు. తాను ప్రేమిస్తున్నానని చెబుతూనే క్షణికావేశంలో ఆమెపై హింసకు పాల్పడలేరు.
ఈ ఘటనలో వాస్తవమేంటంటే.. ఆమె (శ్రద్ధా)పై చాలా రోజుల పాటు వేధింపులు కొనసాగాయి. ఆమెను వేధిస్తున్నారన్న సంగతి చాలా మందికి తెలుసు కూడా..! మహిళల భద్రత గురించి మాట్లాడేప్పుడు.. సన్నిహిత భాగస్వాములు, కుటుంబసభ్యులు, బంధువుల చేతుల్లో వారు ఎదుర్కొనే హింస గురించి చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెద్దగా చదువుకోని పురుషులు మహిళలపై చేయిచేసుకుంటారని గతంలో అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు చదువుతో సంబంధం లేకుండా గృహహింస కనిపిస్తోంది’ అని అన్నారు.
Source: Eenadu