
రాజ్కోట్: నర్మదా డ్యామ్ ప్రాజెక్టును 30 ఏళ్ళపాటు అడ్డుకున్న వ్యక్తితో కలిసి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని చెబుతూ ఏ నైతిక హక్కుతో గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతున్నదని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశ్నించారు. రాబోయే రోజులలో గుజరాత్కు కాంగ్రెస్ ఎంతటి నష్టం కలిగిస్తుందో ఇది తెలియచేస్తుందని అంటూ ఆయన రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు.
రాజ్కోట్ జిల్లాలోని ధోరాజీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. గుజరాత్లో అధిక భాగానికి నర్మదా డామ్ ప్రాజెక్టు మంచినీరు, సాగు నీరు అందిస్తుందని, ఇలాంటి ప్రాజెక్టును మేథాపాట్కర్ మూడు దశాబ్ధాల పాటు అడ్డుకున్నారని గుర్తు చేశారు. వారు గుజరాత్ ప్రతిష్ఠను మంటగరిపారని, ప్రపంచ బ్యాంకుతో సహా ఎవ్వరు ఆర్ధిక సహాయం చేయడానికి ముందుకు రాకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అటువంటి వారితో కాంగ్రెస్ నేత చేతులు కలిపి పాదయాత్ర చేస్తారా? అంటూ నిప్పులు చెరిగారు.
‘‘చాలా మంది కారణంగా నర్మదా నదిపై సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణం ఆలస్యమైంది. కచ్, కథియవాడ్ రీజియన్ల కరువును పోగొట్టేందుకు నర్మదా ప్రాజెక్టు ఒక్కటే పరిష్కారం. కానీ, నిన్న (శనివారం) నర్మదా వ్యతిరేక యూదమయకారిని (నర్మదా బచావ్ ఆందోళన్ యాక్టివిస్ట్ మేధా పాట్కర్)తో కలిసి కాంగ్రెస్ నేత పాదయాత్ర చేశారు. సదరు మహిళ న్యాయ పరమైన ఎన్నో అడ్డంకులు సృష్టించి నర్మదా ప్రాజెక్టును దశాబ్దాలపాటు అడ్డుకున్నారు” అని ప్రధాని మోదీ విమర్శించారు.
Source: Nijamtoday





