
కాకినాడ: కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం చదలవాడ తిరుపతి శృంగార వల్లభ స్వామి ఆలయంలో భక్తుల మధ్య జరిగిన తోపులాటలో ఓ వృద్దురాలికి తీవ్ర గాయాలయ్యాయి. పవిత్ర కార్తిక మాసాన్ని పురస్కరించుకుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. దేవాలయంలో నిర్వహించిన అన్నదానం కోసం భక్తులు క్యూలైన్లలలో నిల్చున్నారు. దీంతో ఒక్కసారిగా తోపులాట జరిగి సత్యవతి(70) అనే వృద్ధురాలి తలకు తీవ్ర గాయాలయ్యాయి.
గమనించిన స్థానిక యువకులు ఆమెను సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం 108లో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఘటనకు దేవస్థాన అధికారుల నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది. ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల క్యూ లైన్లను అధికంగా ఏర్పాటు చెయ్యాలని స్థానిక పోలీసులు అనేకసార్లు ఆలయ ఈవోకు లిఖితపూర్వకంగా చెప్పినప్పటికీ ఆయన వినకపోవడం వల్లే తోపులాట జరిగి మహిళ గాయపడిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.





