
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం హుబ్బళ్లి నగరంలోని శివా కాలనీ, చప్పరి కాలనీల్లో హిందువులను బలవంతంగా క్రైస్తవ మతంలోకి మారుస్తున్నారని హిందూ సంఘాలు ఆరోపించాయి. పాత హుబ్బళ్లి పోలీస్ స్టేషన్ ఎదుట మంగళవారం రాత్రి విశ్వహిందూ పరిషత్తో పాటు పలు హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. హిందువుల్లోని శిక్కలిగర కులానికి చెందిన ఓ కుటుంబంలో భార్యను బలవంతంగా క్రైస్తవ మతంలోకి చేర్చుకున్న పాస్టర్లు, భర్తను సైతం తమ మతంలోకి మార్చేందుకు ప్రయత్నించారు. కానీ, అతను అభ్యంతరం తెలిపి, హిందూ సంఘాలను ఆశ్రయించాడు.
దీంతో హిందూ సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్కు చేరుకుని ఆందోళన చేపట్టారు. తమ కుటుంబంలో కొందరు పాస్టర్లు చిచ్చు పెట్టారని ఓ వ్యక్తి ఆరోపించారు. తొలుత తన వదినను మత మార్పిడి చేశారని, ఇటీవలే తన భార్యను కూడా మార్చేశారన్నారు. తాను హిందువుగా పుట్టానని, మతాన్ని మార్చుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో 14మంది పాస్టర్లతో పాటు ఒక రౌడీ షీటర్ను పోలీసులు అరెస్టు చేశారు.
Source: andhra jyothi





