
న్యూఢిల్లీ: వచ్చే నెలలో భారత్ జీ20 ప్రెసిడెన్సీ (అధ్యక్షత) చేపట్టనుంది. దీనికి సంబంధించిన లోగో, థీమ్, వెబ్ సైట్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఈ ఏడాది డిసెంబరు 1 నుంచి భారత్ జీ20 దేశాల సదస్సుకు అధ్యక్షత వహించనుండడం చారిత్రాత్మక ఘట్టం అని చెబుతూ ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని వెల్లడించారు.
`వసుధైక కుటుంబకం’ అనేది భారత్ నినాదం అని, ప్రపంచం పట్ల భారత్ సహృద్భావానికి ఈ నినాదం ఓ సంతకం వంటిదని మోదీ తెలిపారు. ప్రపంచాన్ని ఏకీకృతం చేసే దిశగా కమలం పువ్వు భారతదేశ విశ్వాసాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెబుతుందని పేర్కొన్నారు. లోగోపై సూచనలు, సలహాలు తెలియజేయాలని ప్రధాని మోదీ దేశ ప్రజలను కోరారు.
ప్రస్తుతం ఇండోనేషియా జీ20 దేశాలకు అధ్యక్షత వహిస్తుండగా, ఆ పరంపరను వచ్చే నెలలో భారత్ అందుకోనుంది. జీ20 దేశాల ప్రెసిడెన్సీ సందర్భంగా భారత్ లో 200 సమావేశాలు జరగనున్నాయి. 32 విభిన్న రంగాలపై భారత్ లోని వివిధ చోట్ల ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా, వచ్చే ఏడాది జీ20 దేశాల శిఖరాగ్ర సమావేశానికి కూడా భారత్ ఆతిథ్యమివ్వనుంది.
Source: Nijamtoday





