
తిరువనంతపురం: రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో తాను రాజకీయ జోక్యం చేసుకొంటున్నట్టు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇటీవల చేసిన ఆరోపణలను గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తోసిపుచ్చారు. ఆ విధంగా తాను జోక్యం చేసుకొన్న కనీసం ఒక్క సందర్భాన్ని చూపమని ఆయన నిలదీశారు. ముఖ్యమంత్రి అటువంటి ఒక్క ఉదాహరణను చూపినా తాను గవర్నర్ పదవికి రాజీనామా చేస్తానని తేల్చి చెప్పారు. లేనిపక్షంలో మీరు ఆ పని చేస్తారా..? అంటూ సీఎం పినరయికి గవర్నన్ బహిరంగంగా సవాల్ విసిరారు.
రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల నియామకంలో తాను జోక్యం చేసుకొంటున్నట్టు ముఖ్యమంత్రి ఆరోపించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆరెస్సెస్కు చెందిన వ్యక్తులను వీసీలుగా నియమించేందుకు గవర్నర్ ప్రయత్నిస్తున్నారని వారు పదే పదే ఆరోపిస్తున్నారు. ఆరెస్సెస్ వ్యక్తిని కాదు, మరే వ్యక్తినైనా కనీసం ఒక్కరిని నేను నా అధికారం ఉపయోగించి నియమించినట్టు నిరూపిస్తే నేను గవర్నర్ పదవికి రాజీనామా చేస్తాను’ అని వెల్లడించారు.
Source: Nijamtoday





