
న్యూఢిల్లీ: భౌగోళిక ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధరల తీవ్రత అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం సవాళ్ళు, వడ్డీరేట్ల పెంపు, డిమాండ్ మందగమనం వంటి అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో భారత్ డిసెంబర్ ఒకటోతేదీ నుంచి జీ20 దేశాల అధ్యక్ష బాధ్యతలను ఇండొనేషియా నుంచి స్వీకరించనుంది. 2023 నవంబర్ 30 వరకూ నిర్వహించే ఈ బాధ్యతల సమయంలో భారత్ ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాల సవాళ్ళ పరిష్కారంపై దృష్టి పెట్టనుందని ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. జీ20 దేశాల్లో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్లు ఉన్నాయి. ప్రపంచ జీడీపీలో ఈ దేశాల వాటా 85 శాతంకాగా, అంతర్జాతీయ వాణిజ్యంలో 75 శాతం. ప్రపంచంలో మూడింట రెండవంతు (దాదాపు 70 శాతం) జనాభాకు ఈ దేశాలే ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.





