News

హిమాచల్​ప్రదేశ్​లో చైనా మహిళ.. నకిలీ పత్రాలు, రెండు దేశాల కరెన్సీ స్వాధీనం

318views

మండి: హిమాచల్​ప్రదేశ్‌లోని మండి జిల్లాలో అనుమానాస్పదంగా ఉన్న ఓ చైనా మహిళను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఆమె నివాసాన్ని తనిఖీ చేసిన అధికారులకు కొన్ని నకిలీ పత్రాలతో పాటు కొంత నగదు దొరికిందని పోలీసులు తెలిపారు. అయితే, అక్టోబరు 22న ఆమెను అరెస్టు చేసినప్పటికి పోలీసులు ఈ విషయాన్ని ఇప్పటివరకు గోప్యంగా ఉంచారు.

జోగిందర్‌నగర్ సబ్ డివిజన్ పరిధిలోని చౌంతరాలోని ఒక మఠంలో 15 రోజులుగా ఒక మహిళ నివసిస్తోందని పోలీసులు తెలిపారు. తనను తాను నేపాల్ వాసి అని చెప్పుకుంటున్నప్పటికీ ఆమె అక్కడి వ్యక్తి కాదని అనుమానం వచ్చిందని చెప్పారు. మహిళను అరెస్టు చేసి ప్రశ్నించిన పోలీసులు ఆమె నివాసాన్ని తనిఖీ చేశారు. అందులో వారికి రెండు సెట్ల ధ్రువపత్రాలు లభ్యమయ్యాయి. ఈ పత్రాల్లో కొన్ని చైనాకు చెందినవి, మరికొన్ని నేపాల్‌కు చెందినవి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

అయితే, రెండు దేశాల పత్రాల్లో ఆమె వయసు వేర్వేరుగా ఉందని, కొన్ని వివరాలు సైతం సరిపోలడం లేదని పోలీసులు తెలిపారు. దీంతో ఆమెపై అనుమానం మరింత పెరిగిందని చెప్పారు. పత్రాలతో పాటు రూ.6.40 లక్షల భారత కరెన్సీ, రూ.లక్షా 10 వేల నేపాల్​ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి