
న్యూఢిల్లీ: జిహాద్ భావన కేవలం ఖురాన్లోనే కాదు.. భగవద్గీత, క్రైస్తవంలోనూ ఉందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి శివరాజ్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రాజకీయ దుమారం రేపింది. కేంద్ర మాజీ మంత్రి మొహిసినా కిద్వాయ్ జీవితగాథ పుస్తకం విడుదల సందర్భంగా ఆయన ఈ మాటలు మాట్లాడారు.
దీనిపై తీవ్రంగా స్పందించిన బీజేపీ… కాంగ్రెస్ చేస్తున్న ఓటు బ్యాంకు రాజకీయాలకు పాటిల్ వ్యాఖ్యలు నిదర్శనమని విమర్శించింది. జిహాద్ గురించి గీతలో ప్రస్తావించారన్న శివరాజ్ పాటిల్ మహాభారత యుద్ద సమయంలోనూ శ్రీ కృష్ణుడు, అర్జునుడికి పాఠాలు చెప్పాడని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు శశి థరూర్, దిగ్విజయ సింగ్, ఫరూఖ్ అబ్దుల్లా, సుశీల్ కుమార్ షిండే తదితరులు పాల్గొన్నారు. ఇస్లాంలో జీహాద్ గురించి సుదీర్ఘ చర్చ ఉందని అంటారని పేర్కొంటూ అన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ, సదుద్దేశాన్ని అర్థం చేసుకోలేకపోతే, అధికారాన్ని ఉపయోగించవచ్చునని తెలిపారు. ఈ విషయాన్ని భగవద్గీత, ఖురాన్లలో పేర్కొన్నారని చెప్పారు.
“అంతా వివరించిన తర్వాత కూడా, ప్రజలు అర్థం చేసుకోకపోతే, వారు ఆయుధాలతో వస్తున్నట్టయితే మీరు పరుగెత్తలేరు, మీరు జిహాద్ అని పిలవలేరు, మీరు దానిని తప్పుగా భావించలేరు, ఇది అర్థం చేసుకోవాలి. చేతిలో ఉన్న ఆయుధాలతో ప్రజలకు అర్థమయ్యేలా చేసే ఈ భావన ఉండకూడదు” అంటూ చెప్పుకొచ్చారు.
క్రైస్తవంలో కూడా జిహాద్ ఉన్నదంటూ స్వయంగా క్రిస్ట్ తాను శాంతికోసం ఈ లోకంలోకి రాలేదని, కత్తితో వచ్చానని చెప్పారని ఆయన పేర్కొన్నారు. ఒకరిని మించి మరొకరు హిందూ విద్వేషాన్ని వెళ్లగక్కుతున్నారని, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని బీజేపీ నేత షెహజాద్ పూనావాలా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Source: Nijamtoday





