
విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరిగిన దసరా ఉత్సవాలలో ఈ ఏడాది రూ.16 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. ఖర్చులు పోనూ రూ.5.5 కోట్లు మిగిలాయన్నారు. ఈనెల 24న దీపావళి రోజున ప్రధాన ఆలయంలో ధనలక్ష్మి పూజ, సాయంత్రం కవాటబంధనం నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈవో భ్రమరాంబ చెప్పారు. 25న సూర్యగ్రహణ కారణంగా ఉదయం 11 గంటలకు ఆలయాన్ని మూసివేస్తున్నట్టు తెలిపారు. 26న మహా నివేదన, హారతి అనంతరం దర్శనాలకు అనుమతి ఇస్తామని పేర్కొన్నారు.
కార్తీకమాస ఉత్సవాలు
26 నుంచి నవంబరు 23 వరకు కార్తీకమాసం ఉత్సవాలు జరుగుతాయన్నారు. నవంబరు 4 నుంచి 8 వరకు భవానీ దీక్షలు ప్రారంభమవుతాయని.. ఏడున కార్తీకపౌర్ణమి సందర్భంగా కోటి దీపోత్సవం, జ్వాలాతోరణం నిర్వహిస్తామన్నారు. 8న చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని మూసివేస్తామన్నారు. 24న అర్థ మండల దీక్షలు ప్రారంభం అవుతాయన్నారు. డిసెంబరు ఏడున కలశజ్యోతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. డిసెంబర్ 15 నుంచి 19 వరకు భవానీ దీక్షా విరమణలు ఉంటాయని, డిసెంబరు 19న భవానీదీక్షల పూర్ణాహుతి ఉంటుందని ఈవో భ్రమరాంబ వివరించారు.





