
లాస్ ఏంజిల్స్: అమెరికా పార్లమెంట్కు మధ్యంతర ఎన్నిక కోసం నిధుల సేకరణకు డెమోక్రటిక్ పార్టీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, పాకిస్తాన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రపంచ పరిణామాల గురించి మాట్లాడుతూ పాక్ గురించి కూడా వ్యాఖ్యానించారు.
బైడెన్, అమెరికా అధ్యక్షుడు అయ్యాక పలు దేశాల్లో రైట్ వింగ్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అలాంటి చాలా దేశాలకు అమెరికాతో సంబంధాల్లో ఉద్రిక్తత నెలకొంది. నిధుల సేకరణ కార్యక్రమంలో జో బైడెన్, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నిరంకుశత్వం, ప్రజాస్వామ్యానికి పొంచి ఉన్న ముప్పు గురించి మాట్లాడారు. లాస్ ఏంజిల్స్లో జరిగిన ఈ కార్యక్రమంలో బైడెన్, పాకిస్తాన్ను లక్ష్యంగా చేసుకున్నారు.
ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన దేశాలలో పాకిస్తాన్ కూడా ఒకటి అని అన్నారు. ”నాకు తెలిసి బహుశా ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర దేశాల్లో పాకిస్తాన్ కూడా ఒకటి. బాధ్యతలేని ఈ దేశం వద్ద అణు ఆయుధాలు ఉన్నాయి” అని బైడెన్ అన్నారు. బహిరంగ సభలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ మాట్లాడుతున్నప్పుడు అక్కడే టెలివిజన్ సైంటిస్ట్ బిల్ నాయి, ఫ్యాషన్ డిజైనర్ టామ్ ఫోర్డ్ ఉన్నారు.





