బీజింగ్: కరోనా కట్టడిలో భాగంగా చైనా ప్రభుత్వం అమలు చేస్తున్న జీరో కొవిడ్ విధానం అత్యంత కఠినంగా వ్యవహరించే చైనా ప్రభుత్వంపై ఆందోళనలు వేళ్లూనుకుంటున్నాయి. కమ్యూనిస్టు పార్టీ 20వ సర్వసభ్య సమావేశాలు జరగనున్న నేపథ్యంలో రాజధాని బీజింగ్లోని రద్దీ కూడలిలో అధ్యక్షుడు జిన్పింగ్కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలను ఉద్యమకారులు ఆవిష్కరించారు. వెంటనే స్పందించిన ప్రభుత్వం వాటిని తొలగించింది. భారీ బలగాలతో కూడిన బందోబస్తును అక్కడ ఏర్పాటు చేసింది.
2019లో వుహాన్లో కొవిడ్ వెలుగు చూసినప్పటి నుంచి చైనా పాలకులు వైరస్ను కట్టడి చేసేందుకు అత్యంత కఠినమైన లాక్డౌన్ను అమలు చేస్తున్నారు.
ప్రపంచమంతా ఆంక్షలు తొలగించి సాధారణ జీవనానికి అనుమతిచ్చినా చైనా మాత్రం జీరో కొవిడ్ విధానానికి పెద్దపీట వేస్తోంది. ఒకటి.. రెండు కేసులు వెలుగు చూసిన కఠిన ఆంక్షలు విధిస్తోంది. వైరస్ కట్టడికి నిర్ధిష్టమైన సమయం కేటాయించకుండా ఆంక్షలు విధించే ఈ ప్రక్రియ పట్ల చైనీయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తమకు స్వాతంత్ర్యం కావాలని, ఆంక్షలతో తమ ఆదాయ మార్గాలు దెబ్బతింటున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.