
విజయవాడ: చినజీయర్ స్వామి పర్యవేక్షణలో విజయకీలాద్రి క్షేత్రంపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చిన జీయర్ స్వామి మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు తిరిగి నిర్వహిస్తామని చెప్పారు. ‘‘1983లో సీతానగరంలో వేద విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశాం. ఆనాటి నుంచి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాం. విజయకీలాద్రి దివ్య క్షేత్రంపై అష్టలక్ష్మీ ఆలయం ప్రతిష్ఠ చేశాం.
దసరా మహోత్సవాలకు విజయవాడ దేశంలోనే పేరెన్నిక ప్రాంతం. అటు ఇంద్రకీలాద్రి, ఇటు విజయకీలాద్రి రక్షగా ఉన్నాయి. వేద పాఠశాల ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు, సేవా కార్యక్రమాలు ఎన్నో చేశాం. విపత్తుల సమయంలో ఇక్కడ నుంచే ఎంతోమందికి అవసరమైన వాటిని పంపించాం. 2,500 రైతులకు యాభై లక్షలు విలువ చేసే మొక్కజొన్న విత్తనాలు అందించాం. 35 ఏళ్లు పైబడిన మహిళలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాం.
క్యాన్సర్ వంటి మహమ్మారి నివారణకు మా ట్రస్ట్ ద్వారా చికిత్స చేయిస్తున్నాం. కరోనా కారణంగా కొంత వరకు సేవా కార్యక్రమాలు తగ్గాయి. ఇప్పుడు మళ్ళీ పూర్తిస్థాయిలో సేవలను అందిస్తున్నాం. చిన్న పిల్లలకు రోగాలు రాకుండా తేనేను పుష్యమి నక్షత్రం రోజున ఇస్తున్నాం. 15లక్షల మంది పిల్లలకు ఇప్పటివరకు సేవలు అందించాం. దసరా ఉత్సవాలు సమయం నుంచే ఈ సేవా కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తున్నాం. అవసరం ఉన్న వారంతా వీటిని వినియోగించు కోవాలి.’’ అని కోరారు.





