
న్యూఢిల్లీ: ప్రస్తుతం యుద్ధం చేసే కాలం కాదని, వెంటనే యుద్ధం ఆపేందుకు శాంతి చర్చలు ప్రారంభించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్కు సూచించారు. షాంఘై సహకార సంఘం ద్వైపాక్షిక సమావేశాల్లో భాగంగా మోదీ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఉక్రెయిన్తో సంక్షోభాన్ని వీలైనంత త్వరగా ఆపివేయాలని కోరారు.
యుద్ధ సమయంలో భారత విద్యార్ధులను సురక్షితంగా తరలించేందుకు సహకరించినందుకు మోదీ పుతిన్కు ధన్యవాదాలు కూడా తెలిపారు. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా ఇద్దరు నేతలూ ఆహారం, ఇంధన భద్రత, ఎరువులు సహా పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు.
‘ఇవాళ ప్రపంచం ముందు.. ముఖ్యంగా వర్ధమాన దేశాల ఆందోళనంతా ఆహార, ఇంధన భద్రత, ఎరువుల గురించే. ఈ సమస్యల పరిష్కారానికి మార్గాలు కనుగొనాలి. దీనిని కూడా మీరు పరిగణనలోకి తీసుకోవాలి. ఇది యుద్ధాల కాలం కాదు. దీనిపై ఫోన్లో మనం పలుసార్లు మాట్లాడుకున్నాం’ అని మోదీ గుర్తుచేశారు. దీనికి పుతిన్ సానుకూలంగా స్పందించడం విశేషం.
Source: Nijamtoday





