
న్యూఢిల్లీ: సామాజిక కార్యకర్త అన్నా హజారే ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ మద్యం విధానంపై చెలరేగిన వివాదంపై మండిపడ్డారు. ఈ విధానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనకు లేఖ రాశారు. మద్యం షాపులు, మద్యం వినియోగం, సిగరెట్ల విక్రయాలపై గతంలో కేజ్రీవాల్ వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఆ లేఖలో గుర్తు చేస్తూ కఠినమైన పదజాలం ఉపయోగించారు. కేజ్రీవాల్ మాటలకు, ఆయన చర్యలకు తేడా ఉందని హజారే ఆరోపించారు.
రాజకీయాల్లోకి రాకముందు కేజ్రీవాల్ రాసిన ‘స్వరాజ్’ పుస్తకం గురించి హజారే ప్రస్తావించారు. హజారే తనతోనే పుస్తకానికి ముందుమాట రాయించారని గుర్తు చేస్తూ అందులో గ్రామ సభ గురించి, ఆదర్శవంతమైన మద్యంవిధానం గురించి గొప్పలు రాశారని ఎద్దేవా చేశారు.
కేజ్రీవాల్ తాను బోధించినవన్నీ మరచిపోయారని, ఢిల్లీ ప్రభుత్వం మద్యం పాలసీని రూపొందించిందని, దీని ద్వారా మద్యం అమ్మకాలు, మద్యం వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారని హజారే ఆరోపించారు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో నుండి ఆవిర్భవించిన ఆప్ ఇతర పార్టీల మార్గంలోనే వెడుతున్నది అంటూ ఆయన స్పష్టం చేశారు.
Source: Nijamtoday





