News

సుప్రీం కోర్టు కార్యకలాపాలు తొలిసారి ప్రత్యక్ష ప్రసారం

374views

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు చరిత్రలో తొలిసారిగా కార్యకలాపాలు ప్రత్యక్ష ప్రసారమ‌య్యాయి. సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణ పదవీ విరమణ చేయనున్న ఆగస్టు 26న సుప్రీం కోర్టు లైవ్​ ప్రొసీడింగ్స్​​ ప్రారంభమయ్యాయి. సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణ.. భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ యుయు లలిత్​, జస్టిస్​ హిమా కోహ్లీతో బెంచ్​ను పంచుకున్నారు. ఈ త్రిసభ్య ధర్మాసనం విచారణలు జరుపుతోంది. తొలిసారిగా సుప్రీం కోర్టులో విచారణలు ప్రత్యక్ష ప్రసారం చేశారు. దీంతో సుప్రీంకోర్టును ప్రజలకు చేరువచేసే క్రమంలో మరో ముందడుగు పడింది.

సీజేఐగా బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం కోసం ప్రయత్నాలు చేస్తున్న జస్టిస్​ ఎన్​వీ రమణ.. తాను పదవీ విరమణ చేసే రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కోర్టు ప్రొసీడింగ్స్​ లైవ్​పై ఏకాభిప్రాయం రావాల్సి ఉందని ఆయన పలుమార్లు అభిప్రాయపడ్డారు. అన్ని కోర్టుల నుంచి ప్రత్యక్ష ప్రసారం జరగాలని ఆకాంక్షించారు.

భారత ప్రధాన న్యాయమూర్తిగా శుక్రవారం పదవీ విరమణ చేయనున్నారు జస్టిస్​ ఎన్​వీ రమణ. సీజేఐగా జస్టిస్​ ఎన్​వీ రమణ విశేష సేవలు అందించారు. న్యాయవాది నుంచి సీజేఐ స్థాయికి ఎదిగారు. 13 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు జడ్జిగా పనిచేశారు. సీజేఐగా 2021 ఏప్రిల్​లో బాధ్యతలు చేపట్టారు. జస్టిస్​ కోకా సుబ్బారావు తర్వాత సుదీర్ఘకాలం సీజేఐగా చేసిన తెలుగు వ్యక్తిగా రికార్డు సృష్టించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి