News

యూపీఐ పేమెంట్స్‌పై చార్జీలు లేవ్‌

425views

న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) లావాదేవీలపై కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టత ఇచ్చింది. యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడానికి ఎలాంటి ఛార్జీలు విధించే ఆలోచన లేదని స్పష్టం చేసింది. ఇటీవల యూపీఐ పేమెంట్స్‌పై ఛార్జీలు పెంచేందుకు ఆర్బీఐ ప్లాన్ చేస్తుందని క‌థ‌నాలు వెలువడుతూ ఉండడంతో కేంద్రం ఈ ప్రకటన చేసింది.

ప్రస్తుతం అత్యధిక లావాదేవీలు యూపీఐ ద్వారా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఎలాంటి చార్జీలు విధించడం లేదని చెప్పడంతో వినియోగదారులకు ఊరట లభించినట్లు అయ్యింది. యూపీఐ అనే డిజిటల్ వ్యవస్థ ప్రజలకు ఎంతో సులభంగా సౌకర్యవంతంగా ఉందని ఆర్థిక శాఖ ట్వీట్ చేసింది.

అందువల్ల యూపీఐ సేవలపై ఎటువంటి ఛార్జీలు విధించే ఆలోచన ప్రభుత్వానికి లేదని తెలిపింది. సర్వీస్‌ ప్రొవైడర్లు ఇతరత్రా మార్గాల ద్వారా తమ ఖర్చులను రాబట్టుకోవాల్సి ఉంటుందని మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌లో తెలిపింది.

డిజిటల్ పేమెంట్స్ పర్యావరణ వ్యవస్థకు కేంద్రం గతేడాది ఆర్థిక సాయం చేసింది. ఈ ఏడాది కూడా అదే సాయాన్ని అందిస్తున్నట్టు ప్రకటించింది. ఐఎంపీఎస్‌ తరహాలోనే యూపీఐ కూడా నిధుల బదలాయింపు వ్యవస్థ కాబట్టి ఈ విధానంలోనూ చార్జీలను వర్తింపచేసే అంశంపై రిజర్వ్‌ బ్యాంక్‌ చర్చాపత్రం విడుదల చేసిన నేపథ్యంలో ఆర్థిక శాఖ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి