ముంబై: రాయ్గఢ్ జిల్లాలోని హరిహరేశ్వర్ బీచ్కు కొట్టుకొచ్చిన అనుమానాస్పద బోటుపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం అసెంబ్లీలో మాట్లాడుతూ.. బోటు వ్యవహారంలో ఉగ్రవాద కోణం లేదని చెప్పారు. ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. అయితే, పడవలో బాణసంచా ఎందుకు ఉన్నదో ఇప్పుడే చెప్పలేమన్న డిప్యూటీ సీఎం.. దీనిపై సమగ్ర దర్యాప్తు జరగుతోందన్నారు.
ప్రాథమిక సమాచారం మేరకు.. కొట్టుకొచ్చిన బోటు ఆస్రేలియాకు చెందిన హాన్ అనే మహిళదని తెలిపారు. తన భర్త జేమ్స్ హర్బర్ట్తో కలిసి మస్కట్ మీదుగా యూరప్ వెళ్తుండగా పడవ ప్రమాదానికి గురైనట్టు తెలిపారు. జూన్ 26న ఇంజిన్ ఫెయిల్ అవ్వడం వల్ల బోటు ప్రమాదానికి లోనైందన్నారు. బోట్లో ఉన్న వారిని కొరియా షిప్ రక్షించిందని పేర్కొన్నారు.
అయితే, ధ్వంసమైన పడవ మాత్రం సముద్ర జలాల్లో కలిసిపోయి అలలకు రాయ్గఢ్ తీరానికి కొట్టుకు వచ్చిందన్నారు. అయినప్పటికీ ఫెస్టివల్ సీజన్ కావడంతో ఈ ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్టు వెల్లడించారు. ప్రస్తుతం స్థానిక పోలీసులు, యాంటీ టెర్రర్ స్క్వాడ్లు కేసు దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు. ప్రజలు జరుపుకునే దహీ హండీ, వినాయకచవితి పండుగలకు పటిష్ఠ భద్రత కల్పిస్తామని పేర్కొన్నారు.