
తిరుపతి: శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాలకు నాక్ ఏ గ్రేడ్, శ్రీ పద్మావతి మహిళ పాలిటెక్నిక్ కళాశాలలకు ఎన్బిఏ గుర్తింపునకు అవసరమైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని టీటీడీ జెఈవో సదా భార్గవి అధికారులను ఆదేశించారు. ఎస్జిఎస్ ఆర్ట్స్ కళాశాల, ఎస్పిడబ్ల్యూ పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను జెఈవో అధికారులతో కలిసి పరిశీలించారు.
అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా జెఈవో మాట్లాడుతూ, కమిటీలు సెప్టెంబర్లో కళాశాలలను సందర్శించనున్న నేపథ్యంలో ఆగస్టు 31వ తేదీకి అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కళాశాలలో మౌలిక వసతులను మరింతగా మెరుగుపరచాలన్నారు. ఐటి తరగతి గదులు, ల్యాబ్ల ఆధునీకరణ, పారిశుద్ధ్యం, పచ్చదనం పెంపొందించడం తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.





