News

తైవాన్ ఆక్రమణకే చైనా ప్రయత్నాలు – తైవాన్ విదేశాంగ శాఖా మంత్రి వెల్లడి

139views

* చైనా ఇక ఇంతకంటే ముందుకెళ్ళకపోవచ్చు – జో బైడెన్

తైవాన్‌ సమీపంలో చైనా యుద్ధ విన్యాసాలతో హోరెత్తిస్తోంది. దీనిపై తైవాన్‌ విదేశాంగ శాఖ మంత్రి జోసఫ్‌ వూ తైపేలో జరిగిన ఓ విలేకర్ల సమావేశంలో స్పందించారు. ”తైవాన్‌ ఆక్రమణకు సన్నాహాల్లో భాగంగానే చైనా ఈ విన్యాసాలు నిర్వహిస్తోంది. యథాతథ పరిస్థితిని మార్చడమే బీజింగ్‌ అసలు లక్ష్యం” అని ఆరోపించారు. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ పర్యటనను ఓ సాకుగా బీజింగ్‌ వాడుకుంటోందని పేర్కొన్నారు.

మరోవైపు చైనాలోని పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ ఈస్ట్రన్‌ థియేటర్‌ కమాండ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము తైవాన్‌ సమీపంలో నిర్వహిస్తున్న యుద్ధ విన్యాసాల్లో జాయింట్‌ బ్లాకేడ్‌, జాయింట్‌ సపోర్ట్‌ కార్యకలాపాలపై దృష్టిపెట్టామని పేర్కొంది.

తైవాన్‌ కూడా నిన్న అర్ధరాత్రి సుమారు గంటకు పైగా యుద్ధ విన్యాసాలను చేపట్టింది. ఈ విషయాన్ని ఆ దేశ 8వ కోర్‌ ప్రతినిధి లూవీ-జై పేర్కొన్నారు. ఈ విన్యాసాల్లో తైవాన్‌ శతఘ్నులు, ఫ్లేయర్లను ప్రయోగించింది. మొత్తం 40 శతఘ్నులను ఇందుకోసం వాడింది. చైనా సోమవారం యుద్ధ విన్యాసాలను పొడిగించాక.. తైవాన్‌ యాంటీ ల్యాండింగ్‌ ఎక్సర్ ‌సైజ్‌లను నిర్వహించింది.

మరోవైపు అమెరికా మాత్రం భిన్నంగా స్పందించింది. చైనా ఉద్రిక్తతలను మరింత పెంచే చర్యలు ఏమీ చేపట్టకపోవచ్చని పేర్కొంది. డోవర్‌ ఎయిర్‌ ఫోర్స్‌ బేస్‌లో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ మాట్లాడుతూ ” నేను చింతించడం లేదు.. కానీ, ఆందోళన చెందుతున్నాను. వారు(చైనా) ఎంత వీలైతే అంత ముందుకెళ్లారు. ఇప్పుడు ఇక దానికంటే ముందుకెళతారని మాత్రం నేను భావించడంలేదు” అని వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.