News

రాష్ట్రంలో పింగళి వెంకయ్య జయంతి వేడుకలు

452views
  • సీఎం క్యాంపు కార్యాలయంలో ఛాయాచిత్ర ప్రదర్శన

న్యూఢిల్లీ: జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలను ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో మంగళవారం ఘనంగా నిర్వహిస్తుందని పర్యాటక, క్రీడలు, సాంస్కృతిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ తెలిపారు.

‘‘తాడేపల్లి క్యాంపు కార్యాలయం వద్ద సీఎం జగన్‌ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, పింగళి వెంకయ్య జీవితంపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను ప్రారంభిస్తారు. చిత్తూరు జిల్లా నగరిలో జరిగే కార్యక్రమంలో మంత్రి రోజా పాల్గొంటారు. పింగళి వెంకయ్య జన్మస్థలమైన కృష్ణా జిల్లా ‘భట్ల పెనుమర్రు’ గ్రామంలో నిర్వహించే కార్యక్రమానికి మంత్రి జోగి రమేష్‌ హాజరవుతారు.

తపాలా శాఖ ప్రత్యేకంగా ముద్రించిన పోస్టల్‌ కవర్‌ను ఆవిష్కరిస్తారు. 1921లో విజయవాడలో మహాత్మాగాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్‌ సమావేశంలో పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని జాతీయ జెండాగా గుర్తిస్తూ ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఆయన జయంతిని మన రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నందుకు తెలుగువారు గర్వపడుతున్నారు’’ అని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి