
న్యూఢిల్లీ: బ్రిటన్ రాజవంశ వారసుడు ప్రిన్స్ చార్లెస్ చిక్కుల్లో పడ్డారు. అల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ కుటుంబం నుంచి ఆయన స్థాపించిన ఛారిటబుల్ ట్రస్ట్ ఒక మిలియన్ పౌండ్లు విరాళంగా తీసుకున్నట్టు ది సండే టైమ్స్ వెల్లడించింది. ఈ ఆరోపణలపై లండన్ పోలీసులు విచారణ చేపట్టారు. 2013లో లాడెన్ కుటుంబానికి చెందిన బకర్తో సమావేశమైన ప్రిన్స్ చార్లెస్.. ఈ విరాళాన్ని అంగీకరించినట్టు ప్రచురించిది.
చార్లెస్ సన్నిహితులు కొందరు విరాళాన్ని వెనక్కి ఇచ్చేయాలని సూచించారని సండే టైమ్స్ పేర్కొంది. ఈ వార్తలపై స్పందించిన చార్లెస్ కార్యాలయం.. ప్రిన్స్ వ్యక్తిగతంగా విరాళాన్ని స్వీకరించారన్న విషయాన్ని ఖండించింది. పూర్తి శ్రద్ధ వహించి ఈ విరాళాన్ని స్వీకరించామని ది ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఛారిటబుల్ ఫండ్ స్పష్టం చేసింది. ట్రస్టు ధర్మకర్తలు అందరూ కలిసే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని తెలిపింది.





