
లక్నో: ఉత్తరప్రదేశ్ గోండా జిల్లాలో దారుణం జరిగింది. అదనపు కట్నం తీసుకురాలేదని భార్యపై బంధువులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ భర్త. ఆ తర్వాత బాధితురాలికి ‘త్రిపుల్ తలాక్’ చెప్పి విడాకులు తీసుకున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. లఖ్నవూకు చెందిన నిందితుడు మహమ్మద్ అద్నాన్కు కొన్నేళ్ళ కిందట బాధితురాలితో వివాహమైంది. అదనపు కట్నం కోసం తరచుగా ఆమెను వేధించేవాడు. తీవ్రంగా కొట్టేవాడు. కొన్ని రోజుల నుంచి అద్నాన్ పెడుతున్న హింసలు తట్టుకోలేక.. బాధితురాలు తన పుట్టింట్లో ఉంటోంది. అద్నాన్, అతని బంధువులు మంగళవారం బాధితురాలి కన్నవారింటికి వెళ్ళారు.
ఒంటరిగా ఉన్న మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. కేంద్ర ప్రభుత్వం నిషేధించినా.. ముమ్మారు తలాక్ చెప్పి విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు అద్నాన్ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పరారీలో ఉన్న అతడి బంధువుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
కర్ణాటకలో త్రిపుల్ తలాక్
అదనపు వరకట్నం తీసుకురాలేదని అపార్ట్మెంట్ లిఫ్ట్లో భార్యకు త్రిపుల్ తలాక్ చెప్పాడు ఓ భర్త. అనంతరం భార్యను ఇంట్లో నుంచి గెంటేశాడు. ఈ ఘటన కర్ణాటక బెంగళూరులోని సుద్దుగుంటెపాళ్య పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
బాధితురాలికి మహమ్మద్ అక్రమ్ అనే వ్యక్తితో కొన్నాళ్ళ కిందట వివాహం జరిగింది. అతడికి రూ.30 లక్షల కట్నం ఇచ్చారు. అయినా అది చాలదన్నట్టు అదనపు కట్నం కోసం అక్రమ్ తన భార్యను నిత్యం వేధించేవాడు. రంజాన్ పండగ సందర్భంగా రూ.10 లక్షలు తీసుకురమ్మని బాధితురాల్ని డిమాండ్ చేశాడు. పుట్టింటికి వెళ్ళిన ఆమెను కొన్ని రోజుల తర్వాత ఇంటికి పిలిచాడు. బాధితురాలు డబ్బులు తీసుకురాకపోవడం వల్ల లిఫ్ట్లోనే ట్రిపుల్ తలాక్ చెప్పేశాడు.





