
గాంధీనగర్: పెట్రోల్లో ఇథనాల్ కలపడం గత ఎనిమిదేళ్ళలో పదిరెట్లు పెరిగిందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. 2014 ఏడాదికి ముందు ఇది 40 కోట్ల లీటర్లు ఉండగా ఇప్పుడు 400 కోట్ల లీటర్లకు చేరిందని పేర్కొంటూ ఈ ప్రక్రియతో రైతుల ఆదాయం కూడా పెరిగిందని చెప్పారు. గుజరాత్ రాష్ట్రం హిమ్మత్నగర్ సమీపంలోని సబర్ డెయిరీకి చెందిన పలు ప్రాజెక్టులను గురువారం ప్రారంభించిన తర్వాత ప్రధాని ప్రసంగించారు.
“2014కు ముందు పెట్రోల్లో కలిపే ఇథనాల్ 40 కోట్ల లీటర్ల కంటే తక్కువగా ఉండేది. చెరుకు, మొక్కజొన్న వంటి వ్యవసాయోత్పత్తుల నుంచి తయారయ్యే ఇథనాల్ను పెట్రోల్తో కలపాలనే తమ ప్రభుత్వ నిర్ణయంతో నేడది 10% మేర పెరిగి 400 కోట్ల లీటర్లకు చేరుకుంది” అని ప్రధాని తెలిపారు.
2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఫలితాన్ని చూపిస్తున్నాయని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. చెరకు, మొక్కజొన్న వంటివాటి నుంచి లభించే ఇథనాల్ను పెట్రోల్తో కలపాలన్న ప్రభుత్వ నిర్ణయంతో రైతుల ఆదాయం గణనీయంగా పెరిగిందని తెలిపారు.
Source: Nijamtoday





