
ధర్మవరం: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం ప్రెస్క్లబ్లో మంగళవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బీజేపీ నేతలపై వైకాపా వర్గీయులు కర్రలతో దాడి చేశారు. బీజేపీ నేతలు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే రక్తం కళ్ళజూశారు. విచక్షణారహితంగా దాడి చేసి, తిరిగి కారులో వెళ్లిపోయారు. ధర్మవరం పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాజు, బీజేపీ కార్యదర్శి రాము సహా మరొకరికి గాయాలయ్యాయి. వారిని పోలీసులు ఆటోలో ఆస్పత్రికి తరలించారు.
ప్రెస్క్లబ్లో మీడియా సమావేశానికి సన్నద్ధమవుతుండగా వైకాపా కార్యకర్తలు, స్థానిక నేతలు ఒక్కసారిగా దాడి చేసినట్టు బీజేపీ నాయకులు చెప్పారు. నిన్న నియోజకవర్గ ప్లీనరీ సందర్భంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.. మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణపై చేసిన వ్యాఖ్యలే ఈ దాడికి కారణమని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు దాడికి పాల్పడ్డవారిని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పట్టణం దాటి వెళ్ళకుండా చెక్పోస్టులను అలర్ట్ చేశారు.
Source: EtvBharat





