గాంధీనగర్: గుజరాత్ అల్లర్లకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందాని(సిట్)కి తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై ప్రముఖ జర్నలిస్టు, సామాజిక ఉద్యమకారిణి తీస్తా సెతల్వాడ్ను గుజరాత్ ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్) పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ముంబైలోని శాంతాక్రజ్ ప్రాంతంలోని తీస్తా నివాసంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ఇవే ఆరోపణలపై మాజీ డీజీపీ ఆర్బీ శ్రీకుమార్, మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్పైనా కేసు నమోదు చేశారు. వీరిలో సంజీవ్ భట్ ఇప్పటికే మరో కేసు కారణంగా జైల్లో ఉండగా శ్రీకుమార్ను కూడా శనివారం అరెస్టు చేశారు. 2002 గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోదీకి సిట్ క్లీన్చిట్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు సమర్ధించడం, ఈ కేసులో సహ పిటిషనర్గా ఉన్న తీస్తా సెతల్వాడ్ వైఖరిని తప్పుబట్టడం తెలిసిందే.
‘‘ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న కొందరు ఉన్నతాధికారులు ఇతరులతో కుమ్మక్కై కేసును సంచలనం చేయడానికి ప్రయత్నించారు. వారంతా అల్లర్ల విషయంలో సిట్కు తప్పుడు సమాచారం ఇచ్చారు. కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించిన అధికారులను జైల్లో పెట్టాలి. అలాగే, సొంత ప్రయోజనాల కోసం తీస్తా సెతల్వాడ్ ఈ కేసును వాడుకున్నారు. ఆమెపైనా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది’’ అంటూ జకియా జాఫ్రీ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ, ప్రధాని మోదీకి సిట్ క్లీన్చిట్ ఇవ్వడాన్ని సమర్ధిస్తూ శుక్రవారం సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
Source: Nijamtoday