
న్యూఢిల్లీ: భారత్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాయి. పాకిస్తాన్ కు వంత పాడుతూ.. తమ మనస్సు నిండా భారత వ్యతిరేకతను నింపుకొంటున్నారు. తాజాగా అమెరికాకు చెందిన డెమెక్రాటిక్ కాంగ్రెస్ మహిళా సభ్యురాలు ఇల్హాన్ ఒమర్ మరోసారి తన భారత వ్యతిరేకతను బయటపెట్టారు. మతస్వేచ్ఛను ఉల్లంఘిస్తున్నారనే నెపంతో భారత్ ను ప్రత్యేక దేశంగా గుర్తించాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గత మూడేళ్లుగా డెమొక్రాటిక్ కాంగ్రెస్ మహిళ సభ్యులు రషీదా తాలిబ్, జువాన్ వర్గాస్, ఇల్హన్ ఒమర్ లు మతస్వేచ్ఛను హరిస్తున్న దేశంగా భారత్ ను గుర్తించాలంటూ.. యూఎస్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ను కోరుతున్నారు.
ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని అవసరమైన చర్యల కోసం హౌజ్ ఫారిన్ అఫైర్స్ కమిటీకి పంపారు. అయితే ఇల్హన్ ఒమర్ పలు సందర్భాల్లో పాకిస్తాన్ కు మద్దతుగా నిలుస్తున్నారు. గత ఏప్రిల్ లో పాకిస్తాన్ లో పర్యటించిన ఈమె అప్పటి ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తో సహా పాక్ అగ్రనేతలను కలిశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పర్యటించారు. ఇల్మన్ ఒమర్ పర్యటనపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పీఓకేకి వెళ్లడం భారత్ సార్వమౌమాధికారాన్ని ధిక్కరించడమే అని.. ఆమె సంకుచితమైన రాజకీయాలను చేస్తోందని విమర్శించింది.





