
అయోధ్య: అయోధ్యలో ప్రవహించే పవిత్ర సరయూనదిలో ఓ జంట ముద్దుల్లో మునిగిపోవడంతో అది చూసిన జనాలు ఆ వ్యక్తిని చితకబాదిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని ప్రముఖ పుణ్యస్థలం, శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో చోటుచేసుకుంది. పవిత్ర సరయూ నదిలో ఓ జంట స్నానానికి దిగారు. ఈ క్రమంలో భార్యకు భర్త ముద్దు పెట్టాడు. పక్కనే స్నానం చేస్తున్నవారు అది చూసి ఆగ్రహం తెచ్చుకున్నారు.
అయోధ్యలో ఇలాంటి వాటిని సహించబోమంటూ మూకుమ్మడిగా అతడిఫై దాడిచేశారు. నది నుంచి బయటకు లాక్కుంటూ దాడి చేశారు. భార్య అడ్డం పడుతున్నా ఆగలేదు సరికదా, తిడుతూ అతడిని కొడుతూనే ఉన్నారు. ఓ వ్యక్తి మాత్రం వారిని అడ్డుకుని ఆ జంటను బయటకు పంపాడు. ఈ ఘటన మొత్తాన్ని ఎవరో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.





