
ఇస్లామాబాద్: పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లో అత్యవసర పరిస్థితిని విధించారు. మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపు కేసులు గణనీయంగా పెరుగున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు పంజాబ్ హోం శాఖ మంత్రి అట్టా తరార్ మీడియాకు తెలిపారు. రోజుకు 4 నుంచి 5 అత్యాచార కేసులు నమోదవుతున్నాయి.
లైంగిక వేధింపులు పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలకు పూనుకుంటోంది. అత్యాచార కేసులను అరికట్టేందుకు ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించిందని, ప్రభుత్వం ఈ విధమైన (అత్యాచారాలు) కేసులను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈ విషయంలో సివిల్ సొసైటీ, ఉమెన్ రైట్స్ ఆర్గనైజేషన్లు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు ప్రభుత్వంతో చర్చించేందుకు ముందుకురావాలని మంత్రి కోరారు. దీనిలో భాగంగా తల్లిదండ్రులు తమ పిల్లలను కాపాడుకోవడంలో దృష్టి నిలపాలని సూచించారు. ప్రభుత్వం కూడా యాంటీ-రేప్ క్యాంపెయిన్ను ప్రారంభించిందని, దీనిపై విస్తృత ప్రచారం చేపడుతున్నట్టు మంత్రి వెల్లడించారు.





