వాషింగ్టన్: చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా మరో ముందడుగు వేసింది. షింజియాంగ్ ప్రావిన్స్లోని వీఘర్ ముస్లింలపై చైనా ప్రభుత్వం చేస్తోన్న అరాచకాలను అడ్డుకొనేందుకు చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా విధించిన ఆంక్షలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలోనే షింజియాంగ్ ప్రావిన్స్ నుంచి వచ్చే దిగుమతులపై అమెరికా ఆంక్షలు విధించింది. ఇప్పటికే అమెరికా ఈ ప్రాంతం నుంచి వచ్చే పత్తి, టమాటాలను నిషేధించింది. తాజాగా.. ఆ ఆంక్షలను అన్ని రకాల వస్తువులకు విస్తరించింది. షింజియాంగ్లో వీఘర్ ముస్లింలను బంధించి వారితో వెట్టిచాకిరి చేయిస్తున్నారని ఇప్పటి వరకు అమెరికా ఆరోపిస్తూ వస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంత ఎగుమతు వీఘర్లతో తయారు చేయించినవి కావని కంపెనీలు నిరూపించుకోవాలని ఆమెరికా షరతు విధించింది. దీంతో వీటిని నేటి నుంచి ‘ది వీఘర్ ఫోర్సుడ్ లేబర్ ప్రివెన్షన్ యాక్ట్’ కిందకు తీసుకొచ్చారు. గత వారం దీనిపై అమెరికా చట్టసభలో చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. అమెరికా కాంగ్రెస్ లెక్కల ప్రకారం చైనా 2017 నుంచి దాదాపు 10 లక్షల మంది వీఘర్లను బంధించింది. వీరితో షింజియాంగ్లోని పలు కర్మాగారాల్లో వెట్టిచాకిరి చేయిస్తున్నారని అమెరికా ఆరోపిస్తోంది.