
నగదు అక్రమ చెలామణీ (Money laundering) కేసులో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ కు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ నిరాకరించింది.
కోల్ కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి మనీలాండరింగ్ లావాదేవీల కేసులో మే 30న జైన్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టగా జూన్ 9 వరకు న్యాయస్థానం ఈడీ కస్టడీకి అనుమతించింది. విచారణ కోసం మరో ఐదు రోజులు అనుమతించాలని ఈడీ కోరగా దానిని జూన్ 13 వరకు పొడిగించింది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
ఈ క్రమంలోనే గత మంగళవారం జైన్ బెయిల్ పిటిషన్ పై వాదనలు విన్న స్పెషల్ కోర్టు న్యాయమూర్తి గీతాంజలి గోయెల్… తుది ఉత్తర్వులను జూన్ 18కి రిజర్వ్ చేశారు. నేడు బెయిల్ అభ్యర్థనను కొట్టివేస్తూ తీర్పు వెలువడింది. 2015-16 సమయంలో హవాలా నెట్వర్క్ ద్వారా జైన్ కంపెనీలకు.. షెల్ కంపెనీల నుంచి సుమారు రూ.4.81 కోట్ల వరకు ముట్టినట్లు ఈడీ తన దర్యాప్తులో గుర్తించింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ హవాలా కేసు దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే సత్యేందర్, ఆయన కుటుంబానికి చెందిన రూ.4.81 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.





