
భారత్ నుంచి తమ దేశానికి దిగుమతి చేసుకొన్న గోధుమలను అక్కడి నుంచి మరో దేశానికి ఎగుమతి చేయడంపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) నాలుగు నెలలపాటు నిషేధం విధించింది.
దీని ప్రకారం గోధమలు, గోధుమ పిండి ఎక్స్పోర్టు, రీ ఎక్స్పోర్టుపై నిషేధం అమల్లోకి వస్తుంది. యూఏఈ ఆర్థికశాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. దేశీయ వినియోగం కోసమే భారత్ గోధుమలను తమ దేశానికి పంపడానికి అంగీకరించిందని యూఏఈ ఈ సందర్భంగా వెల్లడించింది.
మే 14వ తేదీన భారత్ గోధుమల ఎగుమతులను నిషేధించిన విషయం తెలిసిందే. ఆయా దేశాలు భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తేనో, లేదా ఏ దేశాలకైనా లెటర్ ఆఫ్ క్రెడిట్లు ఉంటేనో మాత్రమే మనదేశం గోధుమల ఎగుమతికి అనుమతిస్తోంది. నాటి నుంచి భారత్ 4,69,202 టన్నులు ఎగుమతి చేసింది.
భారత్-యూఏఈ ఫిబ్రవరిలో వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. వచ్చే ఐదేళ్లలో ఇరు దేశాల వాణిజ్యం 100 బిలియన్ డాలర్లను తాకాలన్న లక్ష్యంతో ఈ ఒప్పందం చేసుకొంది.





