
* ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సూటి ప్రశ్న
హవాలా కేసులో అరెస్టైన ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ ను మంత్రివర్గంలో కొనసాగిస్తుండటంపై ఆమ్ఆద్మీ పార్టీపై భాజపా నేత, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కోవిడ్ అనంతరం జ్ఞాపకశక్తి సమస్యలతో బాధపడుతున్నానని సత్యేందర్ జైన్ ఈడీ ముందు చెప్పిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన… అటువంటి వ్యక్తిని మంత్రిగా ఎలా కొనసాగిస్తున్నారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకాకుండా అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి చేతిలో కీలక విభాగాలు పెట్టి ఎలా పాలన చేస్తారని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను సూటిగా ప్రశ్నించారు.
కోల్కకతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి మనీలాండరింగ్ లావాదేవీల కేసులో మే 30వ తేదీన సత్యేంద్ర జైన్ ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే జూన్ 13వరకు సత్యేందర్ ను ఈడీ విచారించింది. ఆ సమయంలో హవాలా లావాదేవీలకు సంబంధించి ప్రశ్నలు అడిగినప్పుడు తాను కోవిడ్ ఇన్ఫెక్షన్ ప్రభావం వల్ల జ్ఞాపకశక్తి కోల్పోయానని జైన్ చెప్పినట్లు సమాచారం. ఇదే విషయాన్ని న్యాయస్థానానికి ఈడీ విన్నవించినట్లు తెలుస్తోంది. వీటిని ప్రస్తావించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, జ్ఞాపకశక్తి కోల్పోయిన వ్యక్తిని మంత్రిగా ఎలా కొనసాగిస్తారని ఆమ్ఆద్మీ పార్టీని నిలదీశారు. మరోవైపు, హిమాచల్ ప్రదేశ్ లో ఆమ్ఆద్మీ తరపున పార్టీ కార్యకలాపాలకు ఇన్చార్జిగా ఉన్న సత్యేందర్ జైన్… ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలను ఎలా గుర్తుపట్టగలరని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.





