
మహమ్మద్ ప్రవక్తపై భాజపా నాయకురాలు నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమెను హత్య చేస్తామంటూ బెదిరింపులు రావడంతో ఢిల్లీ పోలీసులు నుపుర్ కు, ఆమె కుటుంబానికి కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.
తన ప్రాణాలకు ముప్పు ఉందని.. చంపేస్తామంటూ బెదిరింపు లేఖలు వస్తున్నాయని నుపుర్ నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేగాక, సదరు వ్యాఖ్యలకుగానూ కొందరు తనను వేధిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు నుపుర్, ఆమె కుటుంబ సభ్యులకు భద్రత కల్పించినట్లు తెలిపారు.
10 రోజుల క్రితం ఒక టీవీ చర్చా కార్యక్రమంలో భాజపా జాతీయ అధికారి ప్రతినిధి నుపుర్ శర్మ మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఢిల్లీ మీడియా విభాగ బాధ్యుడు నవీన్ జిందాల్ అభ్యంతరకరమైన రీతిలో ట్విటర్లో స్పందించడం ఇటీవల తీవ్ర దుమారానికి తెరలేపిన విషయం తెలిసిందే. దీంతో భాజపా.. నుపుర్ ను సస్పెండ్ చేయడంతో పాటు జిందాల్ ను పార్టీ నుంచి బహిష్కరించింది. ఆ తర్వాత నుపుర్ తన వ్యాఖ్యలకు క్షమాపణలు కూడా చెప్పారు. అయినప్పటికీ కొందరు ఆమెను తీవ్రంగా దూషిస్తూ వేధిస్తున్నారు. ఆమెను, ఆమె కుటుంబ సభ్యులనూ చంపేస్తామంటూ వేధిస్తున్నారు.





