
ఇస్లామాబాద్: గతేడాది పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న హిందూ దేవాలయంపై దాడి చేసిన 22 మందికి ఒక్కొక్కరికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్టు పాకిస్తానీ ఉగ్రవాద నిరోధక న్యాయస్థానం తీర్పు చెప్పింది. 2021 జూలైలో లాహోర్కు 590 కిలోమీటర్ల దూరంలో ఉన్న రహీమ్ యార్ ఖాన్ జిల్లాలోని భోంగ్ నగరంలోని గణేశ్ మందిరంపై వందలాది మంది దాడి చేశారు. ఆ దాడిలో గుడిలోని కొన్ని భాగాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.
కొన్ని మంటల్లో దహనమయ్యాయి. అలాగే గుడిలోని దేవతా విగ్రహాలను కొన్నింటిని ధ్వంసం చేశారు. ఈ కేసులో గతేడాది సెప్టెంబర్లో 84 మందిని అరెస్ట్ చేశారు. కాగా, ఈ కేసుపై కోర్టుల్లో పలుమార్లు విచారణ జరగ్గా గురువారం పాక్ యాంటీ టెర్రరిజం కోర్టు తుది తీర్పును వెలువరించింది. 22 మందిపై నేరారోపణలు రుజువు కావడంతో వారందరికి అయిదేళ్ళపాటు జైలు శిక్ష విధించింది.
కోర్టు తీర్పు అనంతరం నిందితులందరినీ కట్టుదిట్టమైన భద్రత మధ్య కేంద్ర కారాగారానికి తరలించారు. కోర్టు తీర్పు అనంతరం మందిరంలో ధ్వంసమైన భాగాలను పునర్నిర్మించారు. ఈ విషయమై పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్ స్పందిస్తూ గణేష్ మందిరంపై దాడి దేశానికే అవమానకరమని అన్నారు.





