News

చైనాను న‌ర‌కం చూపిస్తున్న క‌రోనా!

621views
  • క్రూరంగా కొవిడ్‌ టెస్టులు

  • ద్వారాలు, త‌లుపుల‌కు వెల్డింగ్‌

  • ప్ర‌జ‌ల‌ను ఇంట్లోనే బంధించిన ప్ర‌భుత్వం

బీజింగ్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ చైనా నగరాల్లో మాత్రం దాని ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కొవిడ్‌-జీరో విధానాన్ని అమలు చేస్తోన్న చైనా, పలు నగరాల్లో కఠిన లాక్‌డౌన్‌ ఆంక్షలను అమలు చేస్తోంది. ఈ క్రమంలో దారుణమైన దాడులు, అధికార దుర్వినియోగం వంటి క్రూరమైన చర్యలకు చైనా ప్రభుత్వం పాల్పడుతుందనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.

ముఖ్యంగా కొవిడ్‌ పరీక్షల పేరుతో దాడులు చేయడం, బలవంతంగా శాంపిళ్ళు తీసుకోవడంతోపాటు ఇళ్ళ‌ను ఇనుపరాడ్లతో బంధిస్తోన్న ఘటనలపై చైనీయుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. వీటికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

ఇనుపరాడ్లతో వెల్డింగ్‌

మహమ్మారి నిర్మూలన పేరుతో చైనా ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్టు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రశ్నించేవారిపై అతి క్రూరంగా ప్రవర్తిస్తూ, అమానవీయ ఘటనలకు తెగబడుతున్నట్టు అమెరికా వార్తా సంస్థలు చెబుతున్నాయి. ముఖ్యంగా లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు ఇళ్ళు, నివాస ప్రాంగణాల నుంచి బయటకు రాకుండా గేట్లను ఇనుపరాడ్లతో వెల్డింగ్‌ చేస్తున్నట్టు పేర్కొంటున్నాయి.

వీటితోపాటు వేల సంఖ్యలో పౌరులను క్వారంటైన్‌ సెంటర్లకు తరలించడం.. పురుషులు, మహిళలు, వృద్ధులు, చిన్నారులు అనే తేడా లేకుండా అందర్నీ ఒకే రూమ్‌లో నిర్బంధిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో పలు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్టు తెలుస్తోంది. ఇలా కొవిడ్‌ కట్టడి పేరుతో తమ ప్రభుత్వం దారుణాలకు పాల్పడుతోందంటూ చైనీయుల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

క్రూరంగా కొవిడ్‌ టెస్టులు

ప్రస్తుతం చైనా అధికారుల తీరును చూస్తుంటే కరోనా వైరస్‌ కంటే లాక్‌డౌన్‌తోనే చైనా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇందుకు షాంఘై వంటి నగరాల్లో భారీస్థాయిలో కొవిడ్‌ టెస్టులు జరుపుతోన్న తీరును ఉదహరిస్తున్నారు. కొవిడ్‌ నమూనాలు ఇచ్చేందుకు నిరాకరించిన ఓ యువతిని బలవంతంగా నేలపై పడేసి శాంపిల్‌ను సేకరిస్తోన్న వీడియో అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.

కొవిడ్‌ టెస్టుకు నిరాకరించిన ఓ వృద్ధురాలి కాళ్ళ‌ను గట్టిగా పట్టుకొని శాంపిళ్లను సేకరించడం మరో వీడియోలో కనిపిస్తోంది. ఇక ఏడుగురు భద్రతా సిబ్బంది ఓ వృద్ధుడి కాళ్ళు, చేతులు అదిమిపట్టి నమూనాలు సేకరించినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇలా షాంఘైతోపాటు పలు చైనా నగరాల్లో కొనసాగుతోన్న ఇటువంటి క్రూరమైన చర్యలకు సంబంధించిన వీడియోలు అక్కడి సోషల్‌ మీడియా యాప్‌ విబోలో వైరల్‌గా మారాయి.

బానిసలు కానివారు మేల్కొండి!

కరోనా వైరస్‌ కట్టడి పేరుతో చైనా అధికారులు చేస్తోన్న అరాచకాలపై ఇన్నిరోజులు ఓపిక వహించిన చైనీయులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. మూర్ఖపు నిబంధనలతో తమ హక్కులను కాలరాస్తున్నారంటూ ప్రభుత్వంపై తిరగబడుతున్నారు. కొవిడ్‌ నిబంధనలపై కొందరు షాంఘైవాసులు అధికారులను నేరుగా ప్రశ్నిస్తుండగా.. మరికొందరు మాత్రం వీధుల్లోకి వచ్చి తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే, అటువంటి వారిని అదుపులోకి తీసుకొని అధికారులు దాడులు చేస్తుండడంపైనా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో బానిసలుగా ఉండడానికి నిరాకరించేవారు మేల్కొండి అంటూ వీడియోల ద్వారా చైనా యువత పిలుపునిస్తోంది. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి